ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి. అయితే మోదీ గురించి ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే ప్రధాని మోదీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి.. అప్పులు ఎన్ని ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చాలా మంది ఆన్‌లైన్‌లో వెతుకుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే?

Single Post Images

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 9 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్నారు. అంతకుముందు 14 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సాధారణంగా 23 ఏళ్ల పాటు దేశంలోనే అత్యున్నత పదవులైన సీఎం, పీఎం కుర్చీల్లో కూర్చున్న నాయకుడికి ఎన్ని ఆస్తులు ఉంటాయి. ఊహించుకోవడానికి కూడా అందడం లేదా. అయితే ఈ మార్చి 31 వ తేదీతో ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సమర్పించిన ఆస్తులు, అప్పుల వివరాలు చూస్తే ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.59 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీకి ఇంత తక్కువ ఆస్తులు ఉన్నాయంటే నమ్మడానికి చాలా కష్టమే అయినా ఇది నిజం.

అయితే గతేడాది అంటే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోదీ ఆస్తులు రూ.2.24 కోట్లు ఉన్నాయి. ఈ ఏడాదికి 15.69 శాతం అంటే రూ.35,13,940 పెరిగి.. రూ. 2.59 కోట్లకు చేరుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన ఆస్తుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రధాని మోదీ వద్ద కొంత నగదు ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్‌ డిపాజిట్లు, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లు, 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి.

ఇక ఎలాంటి స్థిర, చర ఆస్తులు తన పేరు మీద లేవని ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద ఎల్‌ఐసీ పాలసీలు ఉన్నా ఈ సారి వాటి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇక ప్రధాని మోదీ ఆస్తుల్లో 95.55 శాతం ఆస్తులు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -ఎస్‌బీఐ ఎన్‌ఎస్‌సీ బ్రాంచ్‌లో ఎఫ్‌డీఆర్‌, ఎంఓడీల రూపంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక గత ఏడాదితో పోలిస్తే దీని విలువలో 17.64 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఇక అదే ఎస్‌బీఐ బ్రాంచ్‌లోని మరో ఖాతాలో గత ఏడాది రూ. 46 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.574 కు తగ్గినట్లు వెలల్డించారు. ఆయన డిపాజిట్లు, పోస్టల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ విలువ ఈసారి పెరిగినట్లు చెప్పారు. అయితే ఆయన సతీమణి జసోదాబెన్‌ పేరు మీద ఎలాంటి ఆస్తి వివరాలు ఉన్నాయో తనకు తెలియదని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

అయితే సుదీర్ఘ కాలం రాజకీయాల్లో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇంత తక్కువ ఆస్తులు ఉండటం ఆయన అవినీతి లేని పాలనకు నిదర్శనమని బీజేపీ వర్గాలు కొనియాడుతున్నాయి. ఈ సందర్బంగానే ప్రధాని మోదీ స్లోగన్ "నా కావూంగా నా కానే దూంగా"(నేను అవినీతి చేయను.. అవినీతి చేయనీయను) అనే నినాదాన్ని గుర్తు చేస్తున్నారు.


Leave A Reply

Your email address will not be published.*